శ్రీమద్రామాయణము-బాలకాండ-పదునాలుగవ సర్గ-Sri Valmiki Ramayanam in Telugu - Day - 14


ఒక సంవత్సరకాలం గడిచింది. అశ్వమేధయాగము కొరకు వదిలి పెట్టబడిన అశ్వము తిరిగి వచ్చింది. దశరథుడు సరయూ నదీ తీరమున ఉత్తర భాగమున అశ్వమేధ యాగము ప్రారంభించాడు. ఋష్యశృంగుని ప్రధాన ఋత్విక్కుగా ఉంచుకొని పురోహితులు యజ్ఞము ప్రారంభించారు. 

వేదవిదులయిన ఋత్విక్కులు వేదములలో చెప్పిన ప్రకారము యజ్ఞము చేస్తున్నారు. అశ్వమేధ యాగములో ముఖ్య అంశములైన ప్రవర్ణము, ఉపసదమును బ్రాహ్మణులు వేదోక్తముగా నిర్వహించారు. ఇంద్రునికి హవిర్భాగములను అర్పించారు. శ్రేష్టమైన సోమ లతను నలగగొట్టి,రసము తీసారు. దీనితో యాగములో మాధ్యందిన సవము వేదోక్తముగా చేసారు. 

తరువాత ఋత్విక్కులు దశరధునితో తృతీయ సవనమును కూడా నిర్వర్తింపచేసారు. ఆ యాగములో ఏ చిన్న తప్పుకూడా దొర్లకుండా చాలా జాగ్రత్తగా చేస్తున్నారు. 

ఆ యాగమునకు వచ్చిన బ్రాహ్మణుల కందరకూ ఆకలి అనేది తెలియకుండా మృష్టాన్న భోజనములు సమకూర్చారు. ఆ యాగము జరిగిన అన్నీ రోజులు బ్రాహ్మణులు, రాజాధిరాజులు, వారి వెంట వచ్చిన ఉద్యోగులు, భటులు, సన్యాసులు, తాపసులు అందరికీ సమృద్ధిగా భోజన సదుపాయములు చేసారు. తృప్తిగా భోజనములు చేసిన వారికి వస్త్రములు కూడా ఇచ్చి సత్కరించారు. 

వచ్చిన వారందరూ తృప్తిగా భోజనము చేసి దశరధుని పుత్రవంతునిగా దీవించారు. ఆ మాటలు విని దశరధుడు పరమానంద భరితుడయ్యాడు. యాగము జరుగుతున్న సమయములో వేద పండితుల మధ్య వాగ్వివాదములు రసవత్తరముగా జరుగుతుండేది. 

యాగములో ఉపస్తంభములు నిలుప వలసిన సమయము వచ్చినది. బిల్వ వృక్షము కరతో చేసిన ఊపస్తంభములు ఆరు, చండకరతో చేసినవి ఆరు, మోదుగ కరతో చేసిన ఆరు, శ్లేషాత్మకము అనే కర్రతో చేసినది ఒకటి, దేవదారు కర్రతో చేసినవి రెండు యాగ వాటికలో పాతారు. ఒకదానికి మరొక దానికి బారెడు వెడలు ఉండేట్టు పాతారు. ఆ ఊపస్తంభములను బంగారముతో అలంకరించారు. ఆ ఇరవై యొక్క ఊపస్తంభములను రంగు రంగుల వస్త్రములతో అలంకరించారు. 

వేదములలో చెప్పిన ప్రకారము యజ్ఞ కుండము లను ఏర్పాటుచేసారు. దశరథుడు, ఆయన భార్యలు కూర్చొనుటకు వీలుగా గరుడుని ఆకారములో ఒక వేదికను నిర్మించారు. 

దేవతలకు బలి ఇచ్చేనిమిత్తము ఆ ఊపస్తంభములకు రకరకాల పక్షలను, పశువులను, పాములను కట్టారు. యజ్ఞము కొరకు వదిలిన అశ్వమును ఒక ఊపస్తంభమునకు కట్టారు. మూడు వందల పశువులను, యజ్ఞాశమును ఆ ఊపస్తంభములకు కట్టారు. 

తరువాత దశరధుని పట్టమహిషి కౌసల్య అక్కడకు వచ్చింది. అశ్వమును కట్టిన ఊపస్తంబమునకు మూడుమార్లు ప్రదక్షిణము చేసింది. ఆ యజ్ఞాశ్వమును మూడు కత్తులతో చంపింది. శాస్త్రములో చెఫ్టిన ప్రకారము ఆ రోజు రాత్రి అంతా కౌసల్య ఆ గుర్రము పక్కన నివసించింది. 

మరునాడు ఆ యాగమునకు హెూత, అధ్వర్యువు, ఉద్గాత అనే ముగ్గురు ఋత్విక్కులు పట్టపురాణి కౌసల్యను ఆమె ఇద్దరు పరిచారికలను దానముగా తీసుకున్నారు. తరువాత మరొక ఋత్విక్కు చంపబడిన ఆ గుర్రము మెదడును పక్వము చేసి హెూమం చేసాడు.. దశరథుడు ఆ హెూమము లో నుండి వచ్చిన పొగను తృప్తిగా వాసన చూచాడు. 

తరువాత పదహారు మంది ఋత్విక్కులు చంపబడిన ఆ అశ్వము యొక్క శరీర భాగములను శాస్తోక్తముగా హెూమం చేసారు. 

కల్పసూత్ర ప్రకారంగా అశ్వమేధ యాగము మూడు రోజులు వేదోక్తంగా జరపాలి. మొదటి రోజు యజ్ఞమునకు చతుష్పోమము, రెండవ రోజు కార్యక్రమమునకు ఉక్షము, మూడవ రోజు కార్యక్రమమునకు అతి రాత్రము అని పేరు. ఇవే కాకుండా దశరథుడు ఇతరములైన అనేక కార్యక్రమములు చేయించాడు. 

యాగము పూర్తి అయిన తరువాత దశరథుడు తూర్పుదిక్కున ఉన్న తన రాజ్యమును హెూతకును, పశ్చిమ దిక్కున ఉన్న తన రాజమును అధ్వర్యునకును, దక్షిణదిక్కున ఉన్న దేశమును బ్రహ్మకు దానంగా ఇచ్చాడు. ఈ విధంగా చేయవలెనని వేదములు సూచిస్తున్నాయి. యాగఫలమును పొందుటకు దశరథుడు ఈ విధంగా తనరాజ్యమును బ్రాహ్మణులకు దానంగా ఇచ్చాడు. కాని ఆ బ్రాహ్మణులు ఆ రాజ్యమును తిరిగి దశరథునికి ఇచ్చి దానికి తగిన ప్రతిఫలముగా పదిలక్షల గోవులు, వందకోట్ల బంగారు నాణెములు, నాలుగు వందల కోట్ల వెండి నాణెములు తీసుకున్నారు. 

ఆ బ్రాహ్మణులు ఆ ధనమును వశిష్టునకు, ఋష్యశృంగునకు ఇచ్చారు. వారు ఆ ధనమును అందరికి న్యాయపకారంగా పంచి పెట్టారు. అందరూ సంతృప్తి చెందారు. ఇది కాకుండా యాగమును చూడటానికి వచ్చిన వారికి కోటి బంగారు నాణెములు దానంగా ఇచ్చాడు దశరథుడు. 

అగ్ని అయిపోయిన తరువాత ఒక పేద బ్రాహ్మణుడు వచ్చి తనకు కూడా ఏమన్నా ఇవ్వమని యాచించాడు. ఆ సమయంలో దశరథుని చేతిలో ఉన్న బంగారు ఆభరణమును ఆ పేద బ్రాహ్మణునికి బహూకరించాడు. తరువాత యాగమునకు వచ్చిన బ్రాహ్మణులందరికీ భక్తితో నమస్కరించి వారి ఆశీర్వాదములు తీసుకున్నాడు దశరథుడు. ఆ ప్రకారంగా అశ్వమేధ యాగమును పూర్తి చేసాడు దశరథుడు. 

తరువాత దశరథుడు ఋష్యశృంగుని చూచి "ఓ మహాత్మా! అశ్వమేధ యాగము నా చేత చేయించారు. తరువాత నాకు పుత్రసంతానము కలిగి నా వంశము వృద్ధిచెందేటట్టు నాచేత ఒక యాగము చేయించవలసినది" అని ప్రార్థించాడు.

ఇది వాల్మీకి విరచిత 
రామాయణ మహాకావ్యములో 
బాలకాండలో పదునాలుగవ సర్గ 
సంపూర్ణము. 


Comments