శ్రీమద్రామాయణము. బాలకాండ మూడవ సర్గ - Ramayanam in Telugu - Day -3


తనకు నారద మహర్షి చెప్పిన రామ కధ సమగ్రమైనదా లేక ఇంకా అధికంగా ఏమైనా ఉన్నదా  అని వాల్మీకి మహర్షి ఆలోచించాడు. తరువాత వాల్మీకి మహర్షి ఆచమనం చేసాడు. తూర్పు  దిక్కుగా ముఖం పెట్టి ధర్మాసనం మీద కూర్చున్నాడు. శ్రీరాముడిని మనసులో ధ్యానించాడు. నమస్కరించాడు. తన తపోబలంతో ఆలోచించాడు. దశరథుడు, శ్రీరాముడు, సీత, లక్ష్మణుడు ఏమేమి చేసారో, ఏమేమి మనసులో అనుకున్నారో, ఆలోచించారో, రాముడు సీత ఏకాంతంగా ఉన్నప్పుడు ఏమేమి చేసారో, ఏమేమి మాట్లాడుకున్నారో, ఎలా నవ్వుకున్నారో, ఏ ఏ దారుల వెంట నడిచారో, ఎక్కడెక్కడ నివసించారో, రాముడు, సీత, లక్ష్మణుడు ముగ్గురూ అడవులలో ఎక్కడెక్కడ తిరిగారో ఎక్కడెక్కడ నివసించారో, ఆ విషయముల అన్నింటినీ ఆమూలాగ్రంగా, యధాతథంగా తన యోగదృష్టితో చూచాడు వాల్మీకి, అట్టి విషయములను సష్టంగా తెలుసుకున్నాడు. 

మహాతపస్వి అయిన వాల్మీకీకి రామ చరిత్ర అంతా కరతలామలకము అంటే చేతిలో ఉసిరిక కాయ మాదిరి స్పష్టంగా కనపడింది. ఆ ప్రకారంగా మహా తపస్వి అయిన వాల్మీకి రామ చరిత్రను దర్శించిన తరువాత, తాను చూచినది చూచినట్టు, నాలుగు పురుషార్థములు అయిన ధర్మార్థకామ మోక్షములలో, ధర్మము ఎక్కువ ప్రకాశించేటట్టు, మిగిలిన పురుషార్థములు కూడా కూడి ఉండే టట్టు, నారదుడు చెఫ్టిన విషయములు అన్నీ పొందుపరిచి, అందరికీ వినడానికి మనోహరంగా ఉండేటట్టు, రఘువంశ చరిత్ర అయిన రామాయణ మహా కావ్యమును రచించాడు. 

ఆ రామాయణ మహా కావ్యములో రాముని జననము, ఆయన ధర్మనిరతి, పరాక్రమము, ఓరు గుణము, రాముని సౌందర్యము, సత్యశీలత అన్నీ మధురంగా వర్ణించాడు వాల్మీకి రాముడు, లక్ష్మణుడు విశ్వామిత్ర మహర్షితో అడవులలో వెళుతున్నప్పుడు చెప్పిన అనేక కధలు, గాధలు, శివధనుర్బంగము, సీతా స్వయంవరము మనోహరంగా కళ్లకు కట్టినట్టు రచించాడు. తరువాత పరశురామునితో రాముని వాగ్వివాదము, రాముని యువరాజ్య పట్టాభిషేక సన్నాహములు, కైకేయి వరములు కోరడం, రాముడు వనములకు పోవడం, దశరధుని నిర్మాణము, రాముడు అడవులకు పోతుంటే అయోధ్య ప్రజలు దు:ఖించడం, రాముడు వారిని ఓదార్చి పంపివేయడం; 

గంగానదిని దాటడం, గుహునితో రాముడు మాట్లాడటం, తన సారధి అయిన సుమంతుని రథము తీసుకొని వెనుకకు మరలు మనడం, సీతారామ లక్ష్మణులు భరద్వాజ ఆశ్రమం చేరుకోడం, ఆయన ఆదేశాను సారం చిత్రకూటమునకు వెళ్లడం, చిత్రకూటములో పర్ణశాల నిర్మించుకొని ఉండటం, ఇంతలో భరతుడు వచ్చి రాముని తిరిగి రాజ్యము స్వీకరించమని ప్రార్థించడం, రాముడు నిరాకరించడం, 

రాముడు తన తండ్రి మరణ వార్త విని దు:ఖించడం, తండ్రికి అంత్యక్రియలు జరిపించడం, తనపాదుకలను భరతునికి ఇవ్వడం, భరతుడు రాముని పాదుకలను తీసుకొని వెళ్లినంది గ్రామములో నివసించడం, అక్కడే రామ పాదుకలకు పట్టాభిషేకం చేసి రాముని బదులు తాను రాజ్యపాలన సాగించడం, 

తరువాత సీతారామలక్ష్మణులు దండకారణ్యము వెళ్లడం, అక్కడ విరాధుడు మొదలగు రాక్షసులను వధించడం, శరభంగుడు, సుతీక్షుడు మొదలగు మహాఋషుల దర్శనం చేసుకోవడం, సీత అనసూయ తో మాట్లాడటం, అనసూయ సీతకు ఒంటికి పూసుకొనే లేపనము ఇవ్వడం, తరువాత రామలక్ష్మణులు శూర్పనకను చూడటం, ఆమెను విరూపిగా చెయ్యడం, ఖరుడు మొదలగు రాక్షసులను సంహరించడం, 

ఈ విషయాలన్నీ రావణునికి తెలియడం, రావణుడు మారీచుని సాయంకోరడం, మారీచుడు నిరాకరించడం, తుదకు అంగీకరించటం, రాముడు మారీచుని చంపడం, రావణుడు పర్ణశాలలో ఒంటరిగా ఉన్న సీతను అపహరించడం, రాముడు సీత కోసం శోకించటం, కబంధుని చూడటం, పంపా సరస్సునకు వెళ్లడం, శబరిని కలుసుకోవడం, అక్కడనుండి ఋష్యమూక పర్వత ప్రాంతమునకు వెళ్లడం, హనుమంతుడు రాముని కలవడం, 

రామ సుగ్రీవుల మైత్రి, వాలి సుగ్రీవుల యుద్ధము, వాలి వధ, వాలి కోసం తార విలపించడం, రాముడు సుగ్రీవునకు కిష్కింధా రాజ్యము ఇవ్వడం, సీతను వెదకడానికి సాయం చేస్తానని సుగ్రీవుడు అంగీకరించడం, కాని సుగ్రీవుడు మాట తప్పడంతో రామునికి కోపం రావడం, అది తెలిసి సుగ్రీవుడు వానరులను నలుదిక్కులకు సీతను వెదకడానికి పంపడం, సుగ్రీవుడు భారతదేశమును గురించి వానరులకు వర్ణించటం, రాముడు హనుమంతునికి తన ఆనవాలుగా ఉంగరము ఇవ్వడం, హనుమంతుడు సాగరమును అంఘించడం, మధ్యలో మైనాకుని చూడటం, సింహికను చంపడం, లంకా నగరము దగ్గర ఉన్న పర్వతమును చూడటం, రాత్రియందు హనుమంతుడు లంకానగరము ప్రవేశించడం, సీతను వెదుకుతూ పుష్టక విమాగములో ప్రవేశించడం, రావణుని అంత:పుర దర్శనం, తరువాత హనుమంతుడు అశోక వనములో ఉన్న సీతను చూడటం, ఆమెకు ఆనవాలుగా రాముడు ఇచ్చిన ఉంగరము ఇవ్వడం, సీతను రాక్షస స్త్రీలు భయపెట్టడం, త్రిజటకు వచ్చిన స్వప్న వృత్తాంతము, . హనుమంతుడు రాక్షస స్త్రీలను భయపెట్టడం, అశోక వనమును నాశనం చెయ్యడం, ఇంద్రజిత్తుకు పట్టుబడటం, లంకాదహనము,

హనుమంతుడు సముద్రమును దాటి కిష్కింధకు రావడం, దారిలో మధువనమును నాశనం చేయడం, రామునికి సీతను చూచాను అని చెప్పడం, సీత ఇచ్చిన చూడామణిని ఆనవాలుగా సమర్పించడం, రాముడు సుగ్రీవుడు వానర సేనతో సముద్రము వద్దకు చేరుకోవడం, నీలుని సాయంతో సేతువును నిర్మించడం, లంకా నగరం చేరుకోవడం, లంకానగర ముట్టడి, రావణుని తమ్ముడు విభీషణునితో మైత్రి, విభీషణుడు రావణుని ఎలా వధించాలో చెష్టడం, యుద్ధములో కుంభకర్ణుడు, మేఘనాధుడు మరణించడం, రామరావణ యుద్ధము, రావణ వధ, సీతను స్వీకరించడం, విభీషణుని లంకకు పట్టాభిషిక్తుని చేయడం, సీతా సమేతుడై రాముడు పుష్పకవిమానములో అయోధ్యకు తిరిగి రావడం, రామ పట్టాభిషేకము, వానర సైన్యమును వారి వారి స్థావరములకు పంపివేయడం, రామరాజ్యవర్ణన, లోకాప నిందకు వెరిచి తిరిగి సీతను అడవులలో వదిలిపెట్టడం వరకూ వాల్మీకి రామాయణ మహాకావ్యంలో రచించాడు. తరువాత జరుగబోవు విషయములను వాల్మీకి ఉత్తర కావ్యములో రచించాడు. 

ఇది వాల్మీకి విరచిత 
శ్రీమద్రామాయణ మహాకావ్యములో 
బాలకాండలో మూడవ సర్గ 
సంపూర్ణము.


ఈ మహా కావ్యాన్ని ప్రతీనిత్యం భాగాలుగా చేసి మీకు అందించటం జరుగుతుంది. ఏ రోజు కూడా మిస్ అవకుండా చదవాలి అనుకునేవారు పైన subscribe అనే ఆప్షన్ కనబడుతుందిగా, అక్కడ క్లిక్ చేసి మీ ఇమెయిల్ అడ్రస్ ఎంటర్ చేసి మీ మెయిల్ కు వచ్చిన లింక్ ద్వారా కన్ఫర్మ్ చేస్తే ప్రతీ నిత్యం ఈ మహా పురాణాన్ని మీ మెయిల్ కి ఉచితంగా పంపించబడుతుంది. మీ అభిప్రాయాన్ని క్రింది కామెంట్లలో తెలియ చేయండి. దీనిని వాట్స్ ఆప్ లో మీ మిత్రులతో పంచుకోవటానికి. షేర్ మీద నొక్కినప్పుడు కాపీ లింక్ అనే దానిని క్లిక్ చేసి మీ ఫ్రెండ్స్ కి ఆ లింక్ ను పంపండి. జై హింద్. 

Comments